ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 17 August 2026, 8:36 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం.. మహాలక్ష్మి హామీ అమలుకు కట్టుబడి ఉన్నాం దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక జాబ్ పోర్టల్ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ మెదక్ ఖిల్లాకు ప్రత్యేక తపాలా కవర్ ఆవిష్కరణ కస్తూర్బా విద్యాలయంలో నూతన భవన ప్రారంభం

మెదక్,అర్జున్ సమాచారం:
యువతకు నైపుణ్య శిక్షణ, మహిళలకు ఆర్థిక స్వావలంబన, విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు, పారిశ్రామిక రంగానికి అవసరమైన నైపుణ్య మానవ వనరులను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీలు) మరియు గనుల శాఖ మంత్రి డాక్టర్ జీ. వివేక్ వెంకటస్వామి అన్నారు.
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లిలోని శాంతా బయోటెక్నాలజీస్లో మెదక్ కలెక్టర్, స్థానిక పాలనా యంత్రాంగం, ITDC భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక జాబ్ పోర్టల్ను మంత్రి ప్రారంభించారు. దేశంలోనే తొలిసారిగా ఈ తరహా పోర్టల్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ముప్పిరెడ్డిపల్లి పారిశ్రామిక ప్రాంతంలో సుమారు 1,000 పరిశ్రమలు ఉన్నాయని, వాటి అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. పరిశ్రమలకు ఏ నైపుణ్యాలు అవసరమో ముందుగానే గుర్తించి, యువతకు అదే దిశలో శిక్షణ అందిస్తే ఉద్యోగ అవకాశాలతో పాటు పరిశ్రమల ఉత్పాదకత కూడా పెరుగుతుందని చెప్పారు.
పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ITI, పాలిటెక్నిక్ కోర్సుల పాఠ్యప్రణాళికల్లో మార్పులు తీసుకువస్తున్నామని మంత్రి తెలిపారు. పరిశ్రమల యాజమాన్యాలతో నేరుగా చర్చించి వారి అవసరాలను తెలుసుకుని, అందుకు అనుగుణంగా కోర్సులను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
ఉద్యోగాల పేరుతో ఏజెన్సీలకు డబ్బులు చెల్లించే పరిస్థితి లేకుండా టామ్కామ్ ద్వారా పారదర్శకంగా ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జర్మన్, జపనీస్ భాషల్లో శిక్షణ అందించి విదేశాల్లోనూ మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు.
ఉద్యోగ మార్కెట్ వేగంగా మారుతున్న నేపథ్యంలో యువత కూడా తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని మంత్రి సూచించారు. కేవలం సాంప్రదాయ కోర్సులు చదివి ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా, భవిష్యత్తులో డిమాండ్ ఉన్న నైపుణ్యాలను గుర్తించి వాటిని నేర్చుకోవాలని అన్నారు. ఉద్యోగ అవకాశాలు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లేందుకు యువత సిద్ధంగా ఉండాలని సూచించారు.
===============================